Essay on Andhra Pradesh in Telugu (ఆంధ్ర ప్రదేశ్ పై వ్యాసం)
ఆంధ్ర ప్రదేశ్ పై వ్యాసం : ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది.ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా. ఆంధ్ర ప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.
1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరియు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. అడపా దడపా సాగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత 2014 జూన్ 2 న పునర్విభజింపబడింది . నవ్యాంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలు 2 తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి. హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగే అవకాశముంది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకు స్థాపన జరిగింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది. దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది.
0 Comments: